Pages

Thursday 26 April 2012

రామాయణం @ కధ -48



భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||




అక్కడున్న పంచభూతాలు జెరిగినది చూసాయి, కాని చెపుదాము అంటె, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో " గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము " అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జెరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి, కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి. 


మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు "అన్నయ్యా!  ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, 'మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా' అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము " అన్నాడు. 


అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు " మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలోపూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.  

సీత ఏ ధర్మాన్ని పాటించిందో, ఆ ధర్మం సీతని కాపాడలేదు.ఎవడు పరాక్రమము ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో, వాడిని లోకం చేతకానివాడు అంటుంది. లక్ష్మణా! ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి 'సీత ఎక్కడుంది' అని అడిగితే, నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళి ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను, నాకున్న అస్త్ర-శస్త్రములన్నిటిని ప్రయోగించి సూర్య చంద్రులని గతిలేకుండా చేస్తాను, ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను, దేవతలు ఎవరూ తిరగడానికి వీలులేకుండా చేసేస్తాను, నదులలో, సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను, భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను, నా బాణాలతో భూమిని బద్దలుకొడతాను, రాక్షసులు అనే వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను, నా క్రోధం అంటె ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు, మూడులోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా, బతికున్నా మరణించినా, దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్ధన చేస్తే వదిలిపెడతాను, లేకపోతె ఇవ్వాళతో ఈ బ్రహ్మండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడూ ఎలా నిరోధించుకోలేడో, అలా క్రోధముర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగోట్టేస్తున్నాను లక్ష్మణా......" అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు. 


అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి, అంజలి ఘటించి " అన్నయ్యా! నువ్వు సర్వభూత హితేరతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటివాడివి నువ్వు క్రోధమునకు వశమయిపోయి మూడులోకాలని కాల్చేస్తే, ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్ధం ఎక్కడుంది అన్నయ్యా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని, వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటిని బాధపెడతావ అన్నయ్యా. నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంత మూర్తుడై తగినంత శిక్ష వెయ్యాలి, అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావ. అన్నయ్యా! ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడొ ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని, సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్యా! నీకు అంజలి ఘటించి, నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే, ఇక లోకాలు నిలపడలేవు. నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో, నీ పక్కన నేనుండగా, సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము. అంత సాదుధర్మంతో నువ్వు అన్వేషించిననాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే, ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నిటిని లయం చేసెయ్యి. కాని ఈలోగా నీకు ఉపకారం తప్పక జెరిగి తీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు, ఇది సత్యం, సత్యం, సత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు " అన్నాడు. 


లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై, రాముడు తూణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు. 

శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే " యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? " అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా " నేను ఎన్నడూ అసత్యం పలకలేదు " అన్నాడు. " నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు " అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.)  జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడు.    

అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన  రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రహిస్తునారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే " అన్నాడు. 

No comments:

Post a Comment