Pages

Thursday 10 May 2012

రామాయణం @ కధ -58



నిద్రా శనైః కేశవం అభ్యుపైతి ద్రుతం నదీ సాగరం అభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనం అభ్యుపైతి కాంతా స కామా ప్రియం అభ్యుపైతి ||


నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది, నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి, పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోంది. ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు " అని రాముడు అన్నాడు.


అలా వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి " సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రులయందు పరాకుగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దెగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు, ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది. 

నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు, నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ' నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు ' అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దెగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే " అన్నాడు.

హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, 15 రోజుల తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు " అన్నాడు.

సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్కమాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి " పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి, నేల మీద ఉండే బురద ఇంకిపోయింది, చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు, శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడం లేదు. 

లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడం లేదో, ఈ గుహ దెగ్గరికి ఎందుకు రావడంలేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా.


ప్రియా విహీనే దుఃఖ ఆర్తే హృత రాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||

నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైన దుఖంతో ఉన్నాను, ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దెగ్గర ఏముంది లక్ష్మణా, గుహలో పడుకొని ఉన్నాను కదా, అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదయ్యా. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, ఇవ్వాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు, నేను ఇప్పుడు అనాథని, రావణుడేమో నన్ను అవమానించాడు, దీనుడిని, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను, నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను, అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడం లేదు.

ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు, ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. 

అర్థినాం ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణాం |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||

ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో, వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటి వెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో, వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని, తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళి కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు, రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. అందుకని, లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ' మా అన్నగారు కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచి పెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా ' అని అడుగు.

న స సంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః ||

అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ' వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతె నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ' అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు " అని రాముడన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు " ఎందుకన్నయ్యా అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. అన్నయ్య! ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచేస్తోంది, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను " అన్నాడు. 

ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని, చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న " అని చెప్పాడు.

రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ' నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ' అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, మొక్కలు   చేస్తూ ముందుకి వెళ్ళాడు, అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు.

లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానర కాంతలతో విశేషమైన మధుపానం చేసి, హారములన్నీ చెదిరిపోయి, కామ భోగము నందు రమిస్తూ ఉన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో " నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ' రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు '. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి, ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు " అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడుప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు.  

కాని అప్పటికే లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి " ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు " అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు " నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి, నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే, వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది. స్నేహం చెయ్యడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయం చెయ్యకపోవడం నా తప్పే " అన్నాడు.

No comments:

Post a Comment